Skip to main content

పంచబేరాలు: తిరుమలలో కొలువై వున్న శ్రీనివాస మూర్తుల విగ్రహాలు

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే నిత్య కైంకర్యాలన్ని ఆగమ శాస్త్ర అనుసారం జరుగుతాయి. తిరుమ‌ల గ‌ర్భాల‌యం ఆనంద నిలయంలో స్వయంవ్యక్తమైన మూలవిరాట్టుతో పాటు మరో నాలుగు శ్రీనివాస మూర్తుల విగ్రహాలు కొలువై ఉంటారు. శ్రీ వారి విగ్రహంతో పాటు ఈ నలుగురు మూర్తులు పంచబేరాలు అంటారు. బేర అంటే విగ్రహం. వీరికి మూలవిరాట్టుతో పాటు నిత్యం ప్రత్యేక పూజలు, నివేదనలు సాగుతున్నాయి. ఈ పంచబేరాలు విష్ణువు యొక్క మహారూపాలైన విష్ణువు, మహావిష్ణు, సదావిష్ణు వ్యాపి నారాయణులకు సంకేతంగా పండితులు భావిస్తారు.

ధృవబేర:

తిరుమల కొండపై శ్రీవారి యొక్క దివ్వ సాలిగ్రామ బింబం. ఇది స్వయంభుగా వెలిసినది. ఈ మూల‌విరాట్టుని ధృవబేర అని అంటారు. ఈ విగ్రహం తిరుమల కొండపై స్వయంగా వెలిసినట్లుగా చెపుతారు. అత్యంత శక్తి వంతమైన ఈ విగ్రహానికి నిత్యం పూజలు జరుపుతూ వారానికి ఒక్కసారి అర్చకులు ఆగమపండితులు అతి పవిత్రంగా అభిషేకాలను నిర్వహిస్తారు. ఈ స్వయంభుగా విగ్రహాన్ని కదల్చడానికి వీలు ఉండదు. అందువలన ఉత్సవాల సందర్భములలో ఊరేగింపులకు వేరే విగ్రహాలను ఉపయోగిస్తారు.

కౌతుకబేర:

శ్రీవారి గర్భాలయంలో మూలవిరాట్టు పాదాల వద్ద ఉండే వెండి విగ్రహాన్ని కౌతుకబేర అని అంటారు. ఈ విగ్రహాన్ని పదిహేను వందల సంవత్సరాల క్రితం సమవై అనే పల్లవరాణి సమర్పించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ విగ్రహమే భోగ శ్రీనివాసమూర్తిగా పిలువబడుతోంది. ప్రతి రోజూ జరిగే తోమాల సేవలో, రాత్రి పూట జరిగే ఏకాంత సేవలో ఈ భోగ శ్రీనివాసమూర్తిని ఉపయోగిస్తారు. అలాగే ప్రతి బుధవారం ఆలయంలో జరిగే సహశ్ర కలశాభిషేకం సేవ ఈ స్వామి వారికే జరుగుతుంది. ఈ భోగ శ్రీనివాసమూర్తిని ఆలయం లోపల నుండి బయటకు తీసుకురారు.

ఉత్సవబేర:

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని ఉత్సవబేర అని పిలుస్తారు. ఈ స్వామి వారినే మలయప్ప స్వామి అంటారు. 700 సంవ‌త్స‌‌రాల‌కు పూర్వం నాటి ఒక శాస‌నంలో మలయప్ప స్వామి ప్రసక్తి ఉన్నది. పూర్వం ఒకానొక సందర్భములో స్వామివారు ఒక భ‌క్తుని ద్వారా త‌న సందేశాన్ని వినిపించాడ‌ని అంటారు. ఆ సం‌దేశానుసారం శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిక్కులో ఒక కొండ వంగి ఉండే ప్రదేశంలో శ్రీదేవి భూదేవి స‌హిత వేంక‌టేశ్వరుని విగ్రహం లభించింది. శ్రీదేవి, భూదేవి విగ్రహాలను ఉభయ నాంచారులు అని పిలుస్తారు. ఈ స్వామివారికి త‌మిళంలో `మ‌లై కునియ నిన్ర పెరుమాళ్‌` (అనగా త‌ల‌వంచిన ప‌ర్వతం మీద కొలువైన స్వామి) అని పిలువసాగారు. కాలక్రమం‌లో మల‌య‌ప్పస్వామిగా మారింది. శ్రీవారి ఆలయంలో జరిగే కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ, పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం ఈ మలయప్పస్వామి వార్లకే జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భముగా తిరు మాడ వీధులలో జరిగే ఊరేగింపుల సంద‌ర్భంగా ప్రతి రోజూ ఆలయం వెలుపలకు వచ్చి మాడవీదుల్లో ఊరేగుతూ భ‌క్తుల‌కు ఆశీస్సుల‌ను అందిస్తారు.

బలిబేర:

తిరుమల గర్బగుడిలో ఉండే శ్రీవారి చిన్న విగ్రహం. ఈయన కొలువు శ్రీనివాసుడు. మూల విరాట్‌కు తోమాల సేవ అనంతరం కొలువు శ్రీనివాసుని బంగారు వాకిలి వద్ద ఆలయ మండపానికి తీసుకువచ్చి రోజువారి కొలువు జరిపిస్తారు. కొలువులో మొదటిగా పంచాం‌‌గం శ్రవణం చేసి, తరువాత శ్రీవారి హుం‌‌‌డీ ద్వారా వచ్చే ఆదాయాలు, భక్తులు ఇచ్చిన కానుకల వివరాలను చదివి వినిపిస్తారు. ఈ కొలువు శ్రీనివాసమూర్తిని ఆలయం లోపల నుండి బయటకు తీసుకురారు.

ఉగ్రబేర:

గర్బగుడిలో ఉండే ఉగ్ర శ్రీనివాసుడుని 11వ శతాబద్దం వరకు ఉత్సవ విగ్రహంగా పూజించినారు. ఈయన శ్రీదేవీ భూదేవి సహితుడై భక్తులకు దర్శనమిస్తాడు. ఈయననే స్నపన బేర అనికూడా పిలుస్తారు.

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి: శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం). కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం). తెలుగు నెలలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు. పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము . పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వై...