/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Sunday, August 5, 2012

ఆంధ్ర భోజుడు: శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజునిగా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.

కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డుగానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు.

రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.

సంస్కృత సాహిత్యంలో కవిపండిత పోషకుడు భోజ రాజు ఉన్నాడు. తెలుగులో ఆయనంతటి వాడు ఆయనే అనే భావనతో ఆయనను ఆంధ్ర భోజుడు అని పిలిచేవారు. భోజరాజు ముఖం చూస్తే ఎలాంటి వాడికైనా కవిత్వం వస్తుందని అనేవారు. అలాగే దక్షిణాదిలో ఆయన సముఖానికి వచ్చి సాహిత్యాన్ని పాండి త్యాన్ని ప్రదర్శించి బహుమానాలు అందుకున్న వారెందరో ఉన్నారు. రణరంగంలో వీరవిజృంభణ చేసిన విధంగానే సాహిత్యరంగంలోనూ విజృంభణ చేసిన ఘనత ఆయనకు ఉంది.

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకొండ
ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స
అన్న పలుకులు రాయలు రాసినవే! రాయల ఆస్థానమునకు భువన విజయము అని పేరు. భువనవిజయము లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

Sunday, July 8, 2012

కూచిపూడి నృత్యము

కూచిపూడి నృత్యము, ఈ పేరు వినని తెలుగు కళాకారుడు ఉండడు. ఇది భారతీయ నృత్యరీతులలో ప్రధానమైనది. కూచిపూడి భాగవతుల ప్రదర్శనలకు నోచుకోని గ్రామం తెలుగునాట లేదు.
కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడు
- సిద్దేంద్ర యోగి

ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో మచిలీపట్నంకు 15 మైళ్ళ దూరంలో కూచిపూడి గ్రామములో ఆవిర్భవించినది. కూచిపూడి గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. తన పదాలతో దక్షిణ దేశాన్నంతా సుసంపన్నం చేసిన క్షేత్రయ్య స్వగ్రామమైన మువ్వ గ్రామంలో 500 సంవత్సరాలకు పూర్వమే నాట్య కళకు అంకురార్పణ జరిగినట్లు చారిత్రాకాధారాలున్నాయి.

ఇది ప్రాచీన ఆంధ్ర చరిత్రాత్మక నగరమైన (క్రీ పూ 2వ శతాబ్దం) శ్రీకాకుళంకు ఆరు మైళ్ళ దూరంలో ఉన్నది. శాతవాహనులు ఈ కళకు గొప్ప ఆరాధకులుగా ప్రసిద్ధి గాంచారు. అప్పట్లో అత్యంత పవిత్ర దేవాలయమైన ఆంధ్ర విష్ణు దేవాలయం ఆవరణలో లభ్యమైన శాసనాల ప్రకారం దాదాపుగా మూడు వందల మంది దేవదాసీలు రాజమర్యాదలు అందుకునేవారు. ఇక్కడ లభ్యమైన శిల్పాలు కూడా ఆ నృత్య కళాకారిణుల దైవపూజగా భావించే అపురూప భంగిమలను దాచిపెట్టినట్లు కనిపిస్తాయి. చాలాకాలం వరకు కూచిపూడి నృత్యం దేవాలయాల్లో ప్రదర్శింపబడేది.

ఇందుకు ఆధారం 1502నాటి మచ్చుపల్లి కైఫీయతు. 16వ శతాబ్దం చివరి భాగం నుండీ ఈనాటి వరకూ పారిజాతాపహరణాన్ని ప్రదర్శిస్తూ ప్రశంశలు అందుకొంటున్నారు. గోల్కొండ నవాబు అబ్దుల్ హసన్ తానీషా 1687లో కూచిపూడి కళాకారులకు కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా దానమిచ్చాడు.

సాంప్రదాయం ప్రకారం, పూర్వం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే కూచిపూడి నృత్యాన్నిచేసేవారు. అందుకే వీరిని కూచిపూడి భాగవతులు అంటారు. 15 వ శతాబ్దంలో సిద్దేంద్ర యోగి, తన నాత్య గీతాభినయాలను కూచిపూడి కళాకారులకు అంకితం చేశాడు. కూచిపూడి నాట్యంలో ఆడవారు నాట్యం చేయడానికి అనుగుణంగా, కొన్ని మార్పులు చేసి దానిని పరిపుష్టం గావించాడు. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, తాడేపల్లి పేరయ్య వంటి కూచిపూడి నృత్య కళాకారులు దీనిని విస్తరించి, సంస్కరించారు. కూచిపూడి మూడు నిధులుగా ప్రజ్వరిల్లే గొప్ప రీతి. కలాపానికి వెంపటి వెంకట నారాయణ, యక్షగానాలకు చింతా వెంకటరామయ్య, కేళికలకు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గార్లు ప్రఖ్యాతి గడించి వాటిని బాగా అభివృద్ధి చేశారు.

కూచిపూడి నృత్యప్రదర్శన గణేష స్తుతి, సరస్వతీ స్తుతి, లక్ష్మీస్తుతి, పరాశక్తి స్తోత్రాలతో మొదలవుతుంది. ఇది భరతుని 'నాట్య శాస్త్రాన్ని' ఉల్లంఘించదు. చురుగ్గా లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్పసదృశమైన దేహభంగిమలు, హస్తాలు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు, మూకాభినయంతో కూచిపూడి నృత్య కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేయడంలో ఉద్ధండులు. కృష్ణుని భార్య, సత్యభామ ను అనుకరిస్తూ చేసే నాట్యం భామాకలాపం. ఒక ఇత్తడి పళ్ళెంపై పాదాల నుంచి, నాట్యం చేయడాన్నితరంగం అంటారు. ప్రక్కన ఒక గాయకుడు, కర్ణాటక సంగీతశైలిలో కీర్తనలను పాడతాడు. దీనినే నట్టువాంగం అంటారు. ఇందులో మృదంగం, వయొలిన్, వేణువు వంటి వాద్యపరికరాలను ఉపయోగిస్తారు.

వెంపటి చినసత్యం నృత్యరూపకాలకు కొత్త వాతావరణం కల్పించి సామూహిక నృత్యాలకు శుభ్రంగా అన్ని రూపాలలో మిళితంకాగల నృత్య భూమికను స్థిరం చేశారు. దేవదానవ మూర్తులకు, స్వయంవర శోభనలకు, వీరశైవులకు గల అభినయ దృశ్యాలను ఉదేగభరితం చేశారు. 1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని స్థాఫించారు. అనేక నృత్యరూపకాలను రచింపజేసి, నృత్య దర్శకత్వం వహించారు. శ్రీ కృష్ణ పారిజాతం, చండాలిక, మేనకా విశ్వామిత్ర, రుక్మిణీ కల్యాణం, కిరాతార్జునీయం మొద్లగు నృత్య నాటాలు ఈయన దర్శకత్వంలో పేరెన్నికగన్నవి. వైజయంతిమాల, హెమమాలిని, మంజుభార్గవి, చంద్రకళ, రత్నపాప, పద్మామీనన్, ప్రభా రమేష్ వంటి వారంతా వారి శిష్యులే. భారతీయ సంప్రదాయ నృత్య కళలలో నేడు కూచిపూడి నాట్యం గురించి తెలీని స్వదేశీయులు లేరు. విదేశీయులని సైతం ఆకర్షించిన ఈ నృత్య రీతి అనేకమంది విదేశీ కళాకారులకు సువర్ణ గవాక్షాలను తెరిచింది. విదేశాలలో అంతులేని ఆదరణను పొందింది.